శ్రీవారి ఆణివార ఆస్థానం: ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఆణివార ఆస్థానం సందర్భంగా టీటీడీ శుక్రవారం ఆర్జిత సేవలు, విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. భక్తుల రద్దీ దృష్ట్యా సిఫారసు లేఖల ద్వారా జారీ చేసే బ్రేక్ దర్శనాలు కూడా రద్దయ్యాయి.
తమిళ సాంప్రదాయం ప్రకారం ఆణి మాసం చివరి రోజైన కర్కాటక సంక్రాంతి రోజున ఈ ఉత్సవం నిర్వహిస్తారు. పూర్వం మహంతులు దేవస్థానం పాలన స్వీకరించిన రోజు కావడంతో, ఒకప్పుడు టీటీడీ వార్షిక బడ్జెట్ ఈ పర్వదినం నుంచే ప్రారంభమయ్యేది. ప్రస్తుతం బడ్జెట్ ఏప్రిల్కు మారినా, ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా శ్రీరంగం దేవస్థానం తరఫున స్వామివారికి ప్రత్యేక పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వీటిని ముందుగా పెద్ద జీయర్ మఠంలో ఉంచి పూజలు చేసిన అనంతరం మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం గరుడాల్వారి సన్నిధిలో సర్వభూపాల వాహనంపై వేంచేసిన మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా గంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
సాయంకాలం 5-7 టన్నుల పుష్పాలతో అలంకరించిన పుష్ప పల్లకీపై మలయప్ప స్వామి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ వేడుకల కారణంగా కల్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ వంటి ఆర్జిత సేవలన్నీ రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించింది.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్కాస్ట్లు, అధికారిక అప్డేట్లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com